ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ ఆనంద్
ఆదిలాబాద్, జూన్ 10 (ఆధాబ్ న్యూస్): రాష్ట్రంలో ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్కు బదులుగా చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధానాన్ని అవలంబిస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజలను గౌరవిస్తామని, అయితే రౌడీలు, గుండాలు, నేరస్థుల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మాట్లాడుతూ తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రేహౌండ్స్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ, ఆ విభాగంలో పనిచేస్తున్న సుమారు 1700 మంది సిబ్బందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డీజీపీ చెప్పారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.
సైబర్ నేరాలు ప్రస్తుతం పోలీసు శాఖకు పెద్ద సవాల్గా మారాయని, వాటిని అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.









