శ్రీ గిరి లక్ష్మి ఇసుక ట్రైబల్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలి: అలెం కోటి
పినపాక, జూన్ 10 (ఆధాబ్ న్యూస్): పినపాక మండలంలోని దుగినపల్లి–చేగర్శల గ్రామాలకు చెందిన శ్రీ గిరి లక్ష్మి ఇసుక ట్రైబల్ లేబర్ కాంట్రాక్టర్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి డిమాండ్ చేశారు.
బుధవారం చేగర్శల గ్రామాన్ని సందర్శించిన ఆయన సొసైటీ సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2010లో గిరిజనుల సంక్షేమం కోసం 284 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన శ్రీ గిరి లక్ష్మి ఇసుక ట్రైబల్ లేబర్ కాంట్రాక్టర్ సొసైటీని విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడిన తరువాత చేగర్శల ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిందని, ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం గిరిజనుల మధ్య విభేదాలు సృష్టిస్తూ సొసైటీని విభజించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
గిరిజనుల ఐక్యతను దెబ్బతీసే కుట్రలను తుడుం దెబ్బ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అలెం కోటి హెచ్చరించారు. గ్రామాల పేరుతో, రాజకీయాల పేరుతో గిరిజనులను విడదీయడం సరికాదని, గిరిజనుల హక్కులు మరియు అవకాశాలు అందరికీ సమానంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్రీ గిరి లక్ష్మి సొసైటీ సభ్యుల మధ్య ఎలాంటి విభజనలు లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, రెండు గ్రామాలకు చెందిన సభ్యులకు సమాన న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే వారిని ప్రజలు గుర్తించాలని, వాస్తవ పరిస్థితులను అధికారులు సమగ్రంగా పరిశీలించి వెలుగులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు తమ సమస్యలను అలెం కోటి దృష్టికి తీసుకువచ్చి, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
సమావేశంలో సొసైటీ కమిటీ సభ్యులు జట్ల రజిత, గొలుసుల సుజాత, ఆవుల సీతమ్మ, అక్కినబోయిన రమణ, బొల్లా స్వరూపతో పాటు తుడుం దెబ్బ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.








