కొండెక్కిన చికెన్ ధరలు.. సామాన్యుడికి చుక్కలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ జూన్ 16: ఒకప్పుడు వారానికి ఒకసారి అయినా ఇంట్లో చికెన్ వండుకునే కుటుంబాలు, ఇప్పుడు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్న పరిస్థితి నెలకొంది. కరకగూడెం మండలంలోని ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.320కు చేరుకోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రూ.200 నుంచి రూ.240 మధ్య లభించిన చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.320కు చేరుకోవడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా మధ్యతరగతి, రోజువారీ కూలీ కుటుంబాలు చికెన్ కొనుగోలు విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“పిల్లలు అడిగితే కొనక తప్పదు. కానీ కేజీ రూ.320 అంటే సామాన్యుడికి చాలా భారమే” అని స్థానిక వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు చికెన్ ధరలు పెరగడంతో కొనుగోలుదారుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ వ్యాపారంలో పెద్దగా మార్పు లేదని వ్యాపారులు చెబుతున్నారు.
వేసవి కాలం తర్వాత సరఫరా తగ్గడం, పెంపక వ్యయం పెరగడం, డిమాండ్ అధికంగా ఉండటం వంటి కారణాలతోనే ధరలు పెరిగినట్లు పేర్కొంటున్నారు. అయితే ధరల పెరుగుదలపై అధికారులు దృష్టి సారించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ధరలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చికెన్ సామాన్యుడి పళ్లెంలో కాకుండా, ప్రత్యేక సందర్భాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








