నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసులు నమోదు
– ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరిక
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం కరకగూడెం మండలంలోని పలు ఫర్టిలైజర్, విత్తనాల దుకాణాలను సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పీవీఎన్ రావుతో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న విత్తనాలు, ఎరువుల నిల్వలు, లైసెన్సులు, బిల్లులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాల విక్రయానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ సీజన్ను దృష్టిలో ఉంచుకుని నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ వెంకటేశ్వరరావు కోరారు.








