రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు
సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం
గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరకగూడెం, జూన్ 20 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలో రిటర్న్ సీడ్ పేరుతో కొందరు విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆదివాసి జేఏసీ మండల అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆరోపించారు. రైతులను మభ్యపెట్టి నాసిరకం విత్తనాలు విక్రయిస్తూ వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జనవరి నెలలో సాగు చేసిన రెండో పంటలకు సంబంధించి పలు కంపెనీల ప్రతినిధులు గ్రామాలకు వచ్చి అధిక దిగుబడులు, లాభాలు వస్తాయని ఆశ చూపుతూ రైతులకు విత్తనాలు విక్రయిస్తున్నారని తెలిపారు. అయితే కంపెనీ పేరు ఒకటి చెబుతూ, రైతులకు అందజేస్తున్న విత్తనాలు మరొకటిగా ఉండటంతో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని అన్నారు.
నాసిరకం విత్తనాలా, నాణ్యమైన విత్తనాలా అనే విషయంపై స్పష్టత లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో సరైన విత్తనాల ఎంపిక అత్యంత కీలకమని, అలాంటి సమయంలో కొందరు వ్యాపారులు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ప్రస్తుతం ఏ కంపెనీ విత్తనాలు కొనాలి, ఏవి నమ్మాలి అనే సందిగ్ధ పరిస్థితి రైతుల్లో నెలకొన్నదని తెలిపారు. ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం, విత్తనాల నాణ్యతపై సరైన సమాచారం అందించకపోవడం కూడా సమస్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. వెంటనే అధికారులు గ్రామాల వారీగా తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలను విక్రయిస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, అనుమానాస్పద విత్తనాల విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని గొగ్గల కృష్ణ సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.








