కరకగూడెం మండలంలో రెండు పూర్వ ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు. కరకగూడెం,ఆధాబ్ న్యూస్ ప్రతినిధి, మే 30: కరకగూడెం మండలంలోని అనంతారం, భట్టుపల్లి ప్రాథమిక పాఠశాలల పరిధిలో పూర్వ ప్రాథమిక పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల తెలిపారు.
చిన్నారుల ప్రారంభ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు ఈ పాఠశాలలు దోహదపడతాయని చెప్పారు.
ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం సంబంధిత ప్రాథమిక పాఠశాలల్లో ఒక తరగతి గదిని వినియోగించడంతో పాటు రంగురంగుల బొమ్మలు, ఆట వస్తువులు, విద్యా చార్టులు, ఫర్నిచర్ తదితర సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చనుందని తెలిపారు. అలాగే ఈ తరగతుల నిర్వహణకు ఉపాధ్యాయులు, ఆయాలను కూడా నియమించనున్నట్లు వెల్లడించారు.
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో తమ పిల్లలను చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 3-5 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల విజ్ఞప్తి చేశారు.









