KLRఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న KLR ఇంజినీరింగ్ కళాశాల బస్సు అటవీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన స్థానికులు, దారిలో వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన విద్యార్థులను అత్యవసర వాహనాల్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
తల్లిదండ్రుల ఆవేదన
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.









