తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బూర్గంపహడ్ పోలీసులు సూచనలు
కరకగూడెం,ఆధాబ్,న్యూస్:
సమీపిస్తున్న తుపాను నేపథ్యంలో ఈ నెల 28 నుండి 30 వరకు ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని బూర్గంపహడ్ సబ్ ఇన్స్పెక్టర్ మెడా ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ నాగబిక్షం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేకంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజానీకం మరింత అప్రమత్తంగా ఉండాలని, భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడిస్తున్న సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
భారీ వర్షాలు, వరద కారణంగా ప్రమాదాలు జరుగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు దూర ప్రయాణాలను పూర్తిగా నివారించాలని తెలిపారు.
అలాగే —
వరద ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని,
వర్ష సమయంలో చెట్ల కింద నిలవవద్దని,
పిల్లలను వర్షంలో ఆడనివ్వకుండా జాగ్రత్త తీసుకోవాలని,
విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లు, మోటార్ల నుంచి దూరంగా ఉండాలని సూచించారు.
శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా పక్కా భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. మురుగునీటి కాల్వలు, వాగులు, వంకలు, వరద నీరు ప్రవహించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.
ప్రజలందరూ సురక్షితంగా ఉండటం కోసం స్థానిక అధికారులతో సహకరించాలంటూ బూర్గంపహడ్ పోలీసులు ప్రజలను కోరారు.









