భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి
— జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
రాబోయే రెండు రోజుల్లో తుపాను ప్రభావంతో జిల్లాలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశముందని, అటువంటి ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారులు, వంతెనలు, వాగులు దాటేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, విద్యుత్ తీగలు తెగిపోయిన ప్రదేశాలు, చెట్లు కూలిన ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు అవసరం లేని బయట ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు.
వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వరి పంట కోతలు రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన ధాన్యాన్ని ఎత్తయిన ప్రదేశాలకు తరలించి టార్పాలిన్తో కప్పి రక్షించుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద నీటి నిల్వలను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పంటను సురక్షితంగా ఉంచేందుకు రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చని కలెక్టర్ అన్నారు.









