మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది: చంద్రబాబు నాయుడు
న్యూఢిల్లీ,ఆధాబ్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 11 ఏళ్లలో భారత్ ఎన్నో రికార్డులు సృష్టించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మోడీ పాలనలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు, 81 కోట్ల మందికి ఉచిత రేషన్, 144 వందే భారత్ రైళ్లు, 55 వేల కిలోమీటర్ల కొత్త హైవేలు, 86 ఎయిర్పోర్టులు, 16 ఎయిమ్స్ ఆసుపత్రులు నిర్మించబడ్డాయని తెలిపారు.
అదేవిధంగా 7 ఐఐటీలు, 8 ఐఐఎంలు స్థాపించడం ప్రధాని మోడీ పాలనలోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇవన్నీ భారత్ చరిత్రలో ఆల్ టైం రికార్డులుగా నిలిచాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
“11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచంలో 4వ స్థానానికి వచ్చింది. 2028 నాటికి మూడో, 2038 నాటికి రెండో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెబితే, సైనికంగా మన బలం ఏంటో ‘ఆపరేషన్ సింధూర్’ నిరూపించింది” అని చంద్రబాబు నాయుడు అన్నారు.









