బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ నాటకం – సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు
ఆధాబ్ న్యూస్ :బూర్గంపాడు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకం ఆడుతోందని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు విమర్శించారు.
శుక్రవారం మండలంలోని టేకుల చెరువు గ్రామంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ — “ఒకవైపు కేంద్రం బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో బీసీ జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు మద్దతు ఇస్తున్న బీజేపీ ద్వంద్వ రాజకీయాలు స్పష్టంగా బయటపడ్డాయి” అని అన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ పూర్తి బాధ్యత అని, ఆ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం ప్రజలను మోసం చేయడమేనని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు, బీసీ సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈనెల 18న బీసీ జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాండవుల రామనాథం, గుంటుక కృష్ణ, రాయల వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కందుకూరు నాగేశ్వరరావు, బండారు రాకేష్, బండారు లక్ష్మీనారాయణ, దాసరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.









