మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు — “నేనేంటో అందరికీ తెలుసు, 70 కోట్ల కాంట్రాక్ట్ వర్క్ కోసం తాపత్రయపడాల్సిన అవసరం నాకు లేదు”
సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధికి రూ.251 కోట్లు మంజూరు
మేడారం / హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.251 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & ప్రజాసంబంధాల శాఖ మంత్రి మరియు వరంగల్ ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)తో కలిసి ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ,
“గతంలో మంజూరైన రూ.150 కోట్లతో పాటు, ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మరో రూ.101 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.71 కోట్లకు టెండర్లు పిలిచాం. ఈ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగుతున్నాయి,” అని తెలిపారు.
మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రహదారులు, నీటి సదుపాయాలు, ఇతర నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. “మేడారం జాతరకు వచ్చే నిధులు జంపన్న వాగులో వర్షపు నీళ్లలాగా జారిపోకుండా, ఆలయ ప్రాంగణాన్ని గిరిజన–గిరిజనేతరుల ఆరాధ్య దైవాల స్థాయిలో అభివృద్ధి చేస్తాం. పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సాగేందుకు కలెక్టర్లు, ఎస్పీలకు సూచనలు ఇచ్చాం,” అని తెలిపారు.
ఈసారి కోటిమందికి పైగా భక్తులు మేడారం జాతరలో పాల్గొనే అవకాశం ఉందని మంత్రి అంచనా వేశారు.
మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు“నేనేంటో అందరికీ తెలుసు. 70 కోట్ల కాంట్రాక్ట్ వర్క్ కోసం తాపత్రయపడాల్సిన అవసరం నాకు లేదు. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారనే వార్తలను నమ్మడం లేదు. అలాంటి అవకాశం కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నాం. సీతక్క, సురేఖ అక్కలతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
సమావేశంలో ఎంపీ బలరాం నాయిక్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









