చంద్రబాబు సంచలన నిర్ణయం.. టీడీపీ నుంచి ఇద్దరు కీలక నేతల సస్పెన్షన్
ఎపి ,ఆధాబ్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపే పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారం తారస్థాయికి చేరిన నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీడీపీ కీలక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
తాజాగా ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, “కల్తీ మద్యం విషయంలో ఉపేక్షకు తావు లేదు. నిందితులెవరైనా సరే కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేసినట్లు సమాచారం.
తదనంతరం ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కల్తీ మద్యం దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు దాసరిపల్లి జయచంద్రారెడ్డి మరియు కట్టా సురేంద్రలను తక్షణ ప్రభావంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ చర్యతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజా ప్రయోజనాలపై రాజీ పడబోమని చంద్రబాబు ఈ నిర్ణయంతో మరోసారి స్పష్టం చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









