ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటోలో విజయవాడ ప్రయాణం – ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
ఏపీ, ఆధాబ్ న్యూస్:
ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా చేపట్టిన ప్రత్యేక పథకం ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ఉండవల్లి లోటస్ పాయింట్ నుండి విజయవాడ సింగ్నగర్ వరకు ఆటోలో ప్రయాణించారు.
జి. రాజేష్ అనే ఆటో డ్రైవర్కి చెందిన ఆటోలో అతని కుటుంబంతో కలిసి ప్రయాణించిన పవన్ కళ్యాణ్, డ్రైవర్ జీవన విధానం, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రయాణికుల్లో ఎక్కువగా ఎవరు ఉంటారన్న ప్రశ్నకు రాజేష్, “ఉదయం, సాయంత్రం స్కూలు పిల్లలను తీసుకువెళ్తాను. మిగిలిన సమయాల్లో సాధారణ ప్రయాణికులకు ఆటో అందుబాటులో ఉంచుతాను” అని తెలిపారు.
సి.ఎన్.జి. ఇంధనంతో నడిచే ఈ ఆటోలు పర్యావరణానికి మేలు చేస్తాయని, నగర రవాణాలో కొత్త దిశను చూపుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.









