స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ.. రాజకీయ వర్గాల్లో చర్చా వేడి
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే జీపీల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కావడంతో ఎన్నికల హడావిడి మొదలైంది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పాలకవర్గాల గడువు గతేడాది ఫిబ్రవరి 2తో ముగియగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పాలకవర్గాల గడువు 2024 జూన్లోనే ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నా, నిధుల కొరత, నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం ఎప్పటికప్పుడు జోరుగా సాగినా, ప్రభుత్వ నిర్ణయాలు, రిజర్వేషన్ల సమస్యల కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఇటీవల హైకోర్టు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరగాలని స్పష్టం చేయడంతో జిల్లా రాజకీయాల్లో మళ్లీ చర్చా వేడి పెరిగింది.
జిల్లాలోని 571 గ్రామపంచాయతీలకు 5,214 వార్డులు, అంతే సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశారు. రెండు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,572 పోలింగ్ కేంద్రాలు, 3,150 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయి.
ఈనెల 28న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కాగా, వచ్చే నెల 2న తుదిజాబితా ప్రకటించనున్నారు. ఇకపై ఏ ఎన్నికలకు ముందుగా నోటిఫికేషన్ జారీ చేస్తారనే విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయం కీలకమవుతోంది. మంత్రి మండలి ఆమోదంతో ఎన్నికల దిశగా ప్రభుత్వ గ్రీన్సిగ్నల్ రావడంతో, వచ్చే నెలలో స్థానిక సంస్థల్లో ఎన్నికల సందడి తప్పదని భావిస్తున్నారు.









