రెవెన్యూ కాలనీలో పారిశుద్ధ్యం లేమిపై సిపిఐఎం ఆందోళన
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: భద్రాచలం పట్టణంలోని రెవెన్యూ కాలనీలో పారిశుద్ధ్యం లేక ప్రజలు రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంబీ నర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిపిఐఎం 11వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో నిర్వహించిన సమస్యల అధ్యయన యాత్రలో ఆయన మాట్లాడారు.
మూడు నెలల క్రితం పంచాయతీ అధికారులు రోడ్డు మరమ్మతుల కోసం తోలిన గ్రావెల్ మట్టిని చదును చేయకపోవడంతో మురుగు నీరు వీధుల్లో నిలిచిపోయి దోమలు, పందులు తిరుగుతూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు తమ ఆవేదనను నాయకుల ముందు వెల్లడించారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున ఉన్న రెవెన్యూ కాలనీ మురికివాడలా మారిందని, అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు, పారేల్లి సంతోష్ కుమార్, శాఖ కార్యదర్శి పుణ్యవతి, నాయకులు రౌతు గణపతి, గుండ్ల రాణి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు ఎర్రంశెట్టి పూర్ణిమ, సూరమ్మ, సావిత్రమ్మ, రాజ్యలక్ష్మి, మణమ్మ, సరిత, శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు.









