గుండాల తాసిల్దార్కు వినతిపత్రం ఇచ్చిన ఆదివాసి సంక్షేమ పరిషత్ నేతలు
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మండల అధ్యక్షుడు పూనేం రమణబాబు
గుండాల, ఆధాబ్ న్యూస్:
గుండాల మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షుడు పూనేం రమణబాబు గుండాల తాసిల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ బదలాయింపు నిషేధ చట్టం 1970 ప్రకారం 03-02-1970 తరువాత ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన గిరిజనేతరులకు భూమిని బదలాయింపు చేయరాదు. ఇల్లు నిర్మించుకోవడానికి, వ్యాపార సముదాయాలు నిర్వహించేందుకు కూడా అవకాశం లేదని 1/70 చట్టం స్పష్టంగా పేర్కొంటుందని తెలిపారు.
కానీ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గుండాల మండల కేంద్రంలో గిరిజనేతరులు విచ్చలవిడిగా గిరిజన మరియు ప్రభుత్వ భూములను ఆక్రమించి బహుళ అంతస్తుల కట్టడాలు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ఆదివాసీల జీవనవిధానానికి, సంస్కృతికి పెను ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.
తక్షణమే ఈ వ్యవహారాన్ని ఎల్.టి.ఆర్. సుమోటో కేసుగా పరిగణించి అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనేం వసంత్, మండల ప్రధాన కార్యదర్శి గోగ్గేలా సుధాకర్, నాయకులు జబ్బ సుదర్శన్, పూనేం రాజేందర్, చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు.









