యూరియా కోసం వాగ్వాదానికి దిగిన రైతులు — రంగంలోకి దిగిన పోలీసులు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సేల్ పాయింట్లో యూరియా నిల్వలు ఉన్నప్పటికీ, APM మిషన్ పనిచేయకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇంచార్జి స్థలాన్ని వదిలి వెళ్లిపోయిన నేపథ్యంలో రైతులు అక్కడే ఆందోళనకు దిగారు.
ఈ సమయంలో రైతులు, సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
రైతులు మాట్లాడుతూ, “ప్యాక్స్లో స్టాక్ ఉన్నా, డిజిటల్ విధానం సరిగా పని చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సకాలంలో ఎరువులు రాకపోతే పంట నష్టమవుతుంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్పందించిన కొంతమంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. “రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్, వనరులన్నీ ఉన్నా, వ్యవస్థలో ఉన్న అవ్యవస్థ వల్ల శ్రమించాల్సి వస్తోంది,” అంటూ విమర్శలు గుప్పించారు.









