3 కిలోమీటర్లు డోలీపై మృతదేహం తరలింపు – రోడ్డు లేక వింత వేదనలో ఆదివాసీలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్
రోడ్డు లేకపోవడం ఒక్క సాధారణ అసౌకర్యంగా కాదు, కొన్ని గ్రామాల ప్రజలకు అది మానవీయ దౌర్భాగ్యంగా మారింది. కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు వలస గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన దీనికి జీవంత ఉదాహరణ.
ఆ గ్రామానికి చెందిన కొవ్వాసి నందమ్మ (65) అనారోగ్యంతో గడ్డి మందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కరకగూడెం హాస్పటల్, అనంతరం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె మృతి చెందింది.
నందమ్మ మృతదేహాన్ని అశ్వాపురంపాడు గ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనంలో కేవలం చెరువు వరకు మాత్రమే రవాణా చేయగలిగారు. అక్కడి నుంచి మిగిలిన మూడు కిలోమీటర్ల ప్రయాణాన్ని రహదారి లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి అటవీ ప్రాంతంలో మంచంపై మోసుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది మానవతకు విరుద్ధంగా గ్రామానికి కనీస మౌలిక వసతులు లేవనే వాస్తవాన్ని వెలికితీస్తోంది.
గ్రామస్థులు వాపోయారు: “ఎప్పుడు చనిపోతే అదే పరిస్థితి. మృతదేహం ఇంటికి రావాలంటే కూడా ఇలా డోలీపై మోసుకోవాలా? ఇది ఎంత దురదృష్టకరం.”
“తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులు స్పందించాలి,” అని అశ్వాపురంపాడు వలస వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.









