తీన్మార్ మల్లన్నపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: బీసీ సంక్షేమ సంఘం
మణుగూరు, జూలై 15 (ఆధాబ్ న్యూస్):
తాజాగా హైదరాబాదులో బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద జరిగిన దాడిని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కమిటీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి బుర్ర సోమేశ్వర్ మీడియా ప్రకటన విడుదల చేశారు.
మల్లన్న చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి అభ్యంతరకర అంశం లేదని సంఘం స్పష్టం చేసింది. “మూడు శాతం కూడా లేని యలమదొరలతో మీకు మాకు పొత్తా?” అన్న ప్రశ్నలో అసమర్థతను ప్రశ్నించడమే తప్ప అన్యాయం ఏదీ లేదని పేర్కొన్నారు.
“మీరు మా బీసీల చేత, ఎస్సీ, ఎస్టీ యువత ద్వారా మల్లన్న కార్యాలయంపై దాడులు చేయించడం ద్వారా మమ్మల్ని పరస్పరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు.
“మల్లన్న వ్యాఖ్యలపై అభ్యంతరం ఉంటే చట్టబద్ధంగా స్పందించాలి. నిరసన కార్యక్రమాలు చేయండి లేదా పరువు నష్టం దావా వేయండి. కానీ మా సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలకు తావు ఇవ్వకండి” అని స్పష్టం చేశారు.
“జై బీసీ” నినాదంతో ప్రకటనను ముగించిన వారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.









