గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు చేయండి: కర్నె రవి డిమాండ్
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
ఆధార్ అందరికీ వరం అయింది కానీ మారుమూల గిరిజనులకు మాత్రం అది ఓ శాపంగా మారింది” అంటూ సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఖమ్మం తోగు, బుగ్గ, బుడుగుల, పెద్దిపల్లి, ఇప్పలగుంపు గ్రామాల్లో నివసించే గుత్తి కోయ గిరిజనులకు ఇంకా ఆధార్ కార్డులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం తహసిల్దార్ అద్దంకి నరేష్కు వినతిపత్రం సమర్పించిన ఆయన, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆధార్ కార్డులు మంజూరు కావడం లేదని తెలిపారు.
ఆధార్ లేక విద్య, రేషన్, ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాల నుండి గిరిజనులు పూర్తిగా దూరమవుతున్నారని పేర్కొన్నారు. అధికంగా నిరక్షరాస్యులు ఉన్న ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ఆధార్ కార్డు పొందలేకపోతున్నారని చెప్పారు.
ప్రభుత్వం ఆధార్ కేంద్రాల్లో బర్త్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కుటుంబ వివరాలను నమోదు చేసుకొని, మండలస్థాయి అధికారుల సమన్వయంతో వందశాతం గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని ఆయన కోరారు.









