ప్రైవేట్ చిట్ ఫండ్స్ నష్టం – యువకుడి బలైన ప్రాణం!
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
ప్రైవేట్ చిట్ ఫండ్ల దోపిడీకి భద్రాచలం ఏజెన్సీ ప్రజలు మరోసారి బలయ్యారు. రిక్షా కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ (వాసు) అనే యువకుడు చిట్ ఫండ్ మోసాలకు బాధితుడిగా మారి శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంచలనం సృష్టించింది.
శ్రీనివాస్ గతంలో చర్ల రోడ్డులో ఉన్న కనకదుర్గ చిట్ ఫండ్ సంస్థలో ఉద్యోగిగా పని చేశాడు. ఆ సంస్థ ఆరు నెలల క్రితం అకస్మాత్తుగా మూతపడటంతో, ఖాతాదారులు తమ డబ్బుల కోసం శ్రీనివాస్ను తీవ్రంగా బెదిరించడం ప్రారంభించారు. ఒత్తిడికి తాళలేక ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తన జీవితం ముగించుకున్నాడు.
శ్రీనివాస్ మరణానికి కారణం అదే చిట్ ఫండ్ మోసం అని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. “ఈ చిట్టీ కంపెనీ మూతపడిన తర్వాత మా కుటుంబ జీవితం నరకంగా మారింది. వాసును రోజూ ఎవరో బెదిరించేవారు. ప్రభుత్వం కళ్ళు తెరిపించుకోవాలి,” అని బాధతో చెప్పారు.
ఈ ఘటనపై భద్రాచల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “చిల్లరగా కనిపించే ఈ ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలు ప్రజలను దోచుకుంటూ, వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కఠినంగా స్పందించాలి. ఇలా ప్రాణాలు పోయే వరకు వేచి చూడకూడదు,” అంటూ గళమెత్తుతున్నారు.
ప్రజల డిమాండ్:
చిట్ ఫండ్ సంస్థ యజమాన్యంపై కఠిన చర్యలు
బాధిత కుటుంబానికి న్యాయం
భద్రాచలంలో చిట్టీ మాఫియాలపై నిఘా & నియంత్రణ
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.









