పినపాక మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: నలుగురు అరెస్ట్, నగదు, బైకులు స్వాధీనం
పినపాక,ఆధాబ్ న్యూస్: పేకాట స్థావరాలపై పినపాక మండలంలో పోలీసులు గట్టి దాడులు చేపట్టారు. తాజాగా మండలంలోని టీ కొత్తగూడెం గ్రామ సమీపంలో ఉన్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.
డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాలతో, సీఐ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై రాజకుమార్ సిబ్బందితో కలిసి నిర్వహించారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఆ స్థలానికి చేరుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి రూ.5,100 నగదు, ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజకుమార్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రాంతంలో పోలీసుల ఈ దాడి కలకలం రేపగా, పేకాట స్థావరాలపై గట్టి చర్యలు తీసుకోవడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.









