కరకగూడెంలో బీఆర్ఎస్ పార్టీ నేతల నుండి తహసీల్దార్ కార్యాలయానికి మెమొరాండం అందజేత
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి మెమొరాండం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రెండు ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించారు.
డిమాండ్లు:
1. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతులకు తక్షణమే సాగునీరు అందించాలి.
2. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలోని 13 అంశాలను వెంటనే అమలు చేయాలి.
ఈ కార్యక్రమం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు, మండల అధ్యక్షుడు రావుల సోమయ్య నేతృత్వంలో నిర్వహించబడింది. తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ చందా కౌసల్యకు మెమొరాండం అందజేశారు.
ఈ సందర్భంగా రావుల సోమయ్య మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోయిన సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ఎత్తిపోత పథకాల ద్వారా రైతులకు పెద్ద ఊరట కలిగిందని అన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించినా, భద్రాద్రి జిల్లాకు నీటిని నిర్లక్ష్యంగా వదిలేస్తూ, ఖమ్మం జిల్లాకు మాత్రమే తరలిస్తుండడాన్ని ఖండించారు.
ఇక, ఆరు గ్యారెంటీలు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా, హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఈ డిమాండ్లు తక్షణమే అమలు చేయకపోతే భద్రాద్రి జిల్లాలో మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









