ఇందిరమ్మ ఇండ్ల నుంచి పేరు తొలగించడంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
హనుమకొండ, ఆధాబ్ న్యూస్:
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది.
ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన తుళ్ల రజిత లబ్ధిదారుల తుది జాబితాలో పేరు ఉండడంతో ఇంటి కోసం ఎదురు చూస్తూ వచ్చిందని తెలిపింది. అయితే, ప్రస్తుతం జీవనోపాధి కోసం హైదరాబాద్లో పని చేస్తూ జీవిస్తున్నందున, “ఊరిలో ఉండడం లేదన్న” కారణంతో కాంగ్రెస్ నాయకుల సూచనపై అధికారులే తన పేరును జాబితా నుంచి తొలగించారని ఆమె ఆరోపించింది.
కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ – “ఇల్లు వస్తుందని ఆశ పెట్టుకొని ఓదార్పు పొందాను. ఊరిలో లేనంత మాత్రాన పేరు తీయడం తగదే. హైదరాబాద్లో పని చేస్తే ఊరిలో ఇల్లు రాదా?” అని వేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటన పట్ల అక్కడికి విచ్చేసిన ప్రజల్లో ఆవేదన వ్యక్తమైంది. పత్రాల పంపిణీ కార్యక్రమం కొంతకాలం స్థంభించిపోయింది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా సాగాల్సిన కార్యక్రమంలో ఈ ఘటన కలకలం రేపింది. బాధితురాలైన రజితకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.









