ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇకపై నెలలో 15 రోజులు – రోజుకు రెండు పూటలుగా రేషన్ సరుకుల పంపిణీ చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని పునరుద్ధరించిన ప్రభుత్వం.

ఆధాబ్ న్యూస్,ఏపీ:
పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు గత ప్రభుత్వ పాలనలో అందకపోవడాన్ని గమనించిన కొత్త ప్రభుత్వం, దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇంటింటికీ సరుకులు పంపిణీ చేస్తామంటూ రూ.1600 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన వాహనాల ద్వారా సరఫరా వాయిదాపడటంతో, వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజువారీ పని మానుకొని, ఎప్పుడు వస్తుందో తెలియని వాహనాల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీనిపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం సుదీర్ఘ సమీక్ష నిర్వహించి, అక్రమ రేషన్ బియ్యం తరలింపు కేసులను వెలికితీసింది. కాకినాడ, విశాఖ పోర్టుల్లో వేలాది టన్నుల అక్రమ బియ్యం పట్టుబడినట్టు వెల్లడించారు.

ఈ సమస్యల నివారణకు భాగంగా, ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు, రేషన్ సరుకులను చౌకధరల దుకాణాల ద్వారా అందించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా ప్రజల రద్దీ తగ్గుతుందని, ప్రతి ఒక్క కుటుంబానికి సరుకులు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంకా, దివ్యాంగులకు మరియు 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటివద్దకే సరుకులు అందించే ప్రత్యేక సదుపాయం కల్పించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని శాఖ, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!