రాజీవ్ యువ వికాసానికి సీబిల్ స్కోర్ అవసరం లేదు – అపోహలకు తావులేదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో మంగళవారం నూతనంగా నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసి ప్రసంగించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి స్థానిక ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షత వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్తో కలిసి జిల్లా పోడు భూముల అంశంపై సమీక్ష నిర్వహించారు.
తరువాత ఇల్లెందు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, “రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థికంగా ఎదగడానికి సహాయపడే ఉద్దేశంతో ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకానికి బ్యాంక్ సీబిల్ స్కోర్తో ఎలాంటి సంబంధం లేదు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది. స్కోర్ లేనందుకు ఎవరూ కలత చెందాల్సిన అవసరం లేదు,” అని స్పష్టం చేశారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ఈ పథకం కింద మంజూరైన సహాయాన్ని అందజేస్తామని ఆయన వెల్లడించారు.









