అర్హులకు తప్పనిసరిగా సంక్షేమ ఫలాలు అందాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి చట్టం అమలు విషయాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఇప్పటికే మొదటి విడతలో ప్రతి మండలానికి ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన గ్రామపంచాయతీల్లో అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు.
అర్హుల ఎంపిక ప్రక్రియలో నియోజకవర్గ ప్రత్యేకాధికారులు తమ వద్ద ఉన్న జాబితాలను ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లకు అందజేసి, వారు స్థానిక ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకొని అసలైన నిరుపేదులను గుర్తించాలన్నారు. జాబితాలో పేరు లేనివారు అర్హులు అయితే, వారి పేర్లను కూడా చేర్చాలని తెలిపారు.
సమగ్రమైన అర్హుల జాబితాను స్థానిక శాసనసభ్యుల సహకారంతో సిద్ధం చేయాలని, ఇందు ద్వారా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు చేరుతాయని కలెక్టర్ అన్నారు. అన్ని పథకాలు లక్ష్యాన్ని చేరేందుకు అధికారులు చురుకైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.









