వరంగల్ సభ విజయవంతం చేద్దాం: రావుల సోమయ్య
రేపు ఎల్కతుర్తిలో బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ
కరకగూడెం, ఆధాబ్, న్యూస్
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరింత బలపర్చే ఉద్దేశ్యంతో, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) రజతోత్సవ బహిరంగ సభను వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రేపు (27-04-2025) నిర్వహించనున్నారు. ఈ సభను ఘనవంతం చేయాలని కరకగూడెం మండల బిఆర్ఎస్ అధ్యక్షులు రావుల సోమయ్య కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ శక్తి ప్రదర్శన
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో నిర్వహించే ఈ సభ కోసం, కరకగూడెం మండల వ్యాప్తంగా బిఆర్ఎస్ సైనికులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన, మహిళా నేతలు ఆత్మగౌరవంతో భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రేగా కాంతారావు సమన్వయంతో ఏర్పాట్లు
ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు మార్గదర్శనంలో నిర్వహిస్తున్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి జెండా ఆవిష్కరణలు చేస్తూ సభకు బయలుదేరేలా కార్యాచరణ రూపొందించారని రావుల సోమయ్య తెలిపారు.
ఉదయం 9:30 గంటలకు బయలుదేరాలి
రేపు ఉదయం 9:30 గంటలకు మండల కేంద్రం నుంచి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిపోవాలని రావుల సోమయ్య సూచించారు. “బిఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ, మనందరం తెలంగాణ గర్వాన్ని ప్రపంచానికి చాటుదాం,” అని ఆయన పిలుపునిచ్చారు.









