రేపటి నుంచి చేప మందు పంపిణీ
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భారీ ఏర్పాట్లు
హైదరాబాద్, జూన్ 7 (ఆధాబ్ న్యూస్): మృగశిర కార్తె సందర్భంగా ప్రసిద్ధ చేప మందు పంపిణీ కార్యక్రమం జూన్ 8 సోమవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభం కానుంది. జూన్ 9 మంగళవారం రాత్రి వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు చేప మందు పంపిణీ కొనసాగనుంది.
ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి బతిని గౌడ్ కుటుంబం గత 176 సంవత్సరాలుగా ఉచితంగా ఈ చేప మందును అందిస్తోంది. ఈ సంప్రదాయంలో బతికున్న కొర్రమీను చేప పిల్ల నోట్లో ప్రత్యేక పసుపు మూలికల పేస్ట్ పెట్టి బాధితులకు మింగిస్తారు. శాఖాహారులకు బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని అందజేస్తారు.
కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. సుమారు 1.4 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయగా, క్యూలైన్ల వద్ద ఫ్యాన్లు, కూలర్లు, తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.
చేప మందు తీసుకున్న అనంతరం 45 రోజుల పాటు ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలని నిర్వాహకులు సూచించారు. అలాగే ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలలో మందు బిళ్లలను కూడా తీసుకోవాలని తెలిపారు.
భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని మందు తీసుకునేందుకు వచ్చే వారు తెల్లవారుజామునే చేరుకుంటే క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గుతుందని నిర్వాహకులు సూచించారు.









