రైతుల సమస్యలపై వ్యవసాయ అధికారికి ఆదివాసి జేఏసీ మెమోరండం
– రైతులను చైతన్యవంతులను చేయాలని అధికారులకు జేఏసీ వినతి
– ఫెర్టిలైజర్ షాపుల్లో తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని డిమాండ్
– తరుగు పేరుతో రైతుల దోపిడీ అరికట్టాలని ఆగ్రహం
– నాసిరకం విత్తనాల మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కరకగూడెం, జూన్ 6 (ఆధాబ్ న్యూస్): మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసి జేఏసీ నాయకులు శనివారం వ్యవసాయ అధికారికి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా రైతులను చైతన్యవంతులను చేయడం, వ్యవసాయ రంగంలో అవగాహన పెంపొందించడం వంటి అంశాలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.
వ్యవసాయ అధికారితో జరిగిన సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జేఏసీ నాయకులు వివరించారు. రైతులకు కాలానుగుణంగా ఏ పంటలు సాగు చేయాలి, ఏ ఎరువులు, పురుగుమందులు ఉపయోగించాలి అనే విషయాలపై వ్యవసాయ శాఖ తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దీంతో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా ఫెర్టిలైజర్ దుకాణాల్లో విక్రయించే ప్రతి ఎరువు, పురుగుమందు, విత్తనానికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యాపారులు రసీదులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనివల్ల నాసిరకం ఉత్పత్తులు విక్రయించినా రైతులు ఫిర్యాదు చేసే పరిస్థితి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేఏసీ నాయకులు తెలిపారు. 50 కిలోలు, 60 కిలోల బస్తాలకు ఇష్టానుసారంగా తరుగు విధిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని అరికట్టి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
అలాగే రిటర్న్ సీడ్ విత్తనాల పేరుతో కొందరు వ్యాపారులు రైతులకు అధిక దిగుబడుల ఆశ చూపించి నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత శాఖల పర్యవేక్షణ లోపం వల్ల ఇటువంటి మోసాలు పెరుగుతున్నాయని, రైతులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ మండల అధ్యక్షుడు గొగ్గల కృష్ణ, కన్వీనర్ రామారావు, గౌరవ సలహాదారు తోలెం రామారావు, ప్రచార కార్యదర్శి గోగ్గల సతీష్ కుమార్, కార్యవర్గ సభ్యులు కొమరం సత్యనారాయణ, ఈసం రఘుబాబు తదితరులు, పలువురు రైతులు పాల్గొన్నారు.









