అన్నకు తల కొరివి పెట్టిన చెల్లి…
కన్నీరు పెట్టించిన కరకగూడెం విషాదం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
జీవితంలో కొన్ని ఘటనలు కేవలం వార్తలుగానే మిగలవు… మనసును ముక్కలుగా చేసే జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం అలాంటి హృదయ విదారక దృశ్యానికే నిదర్శనంగా నిలిచింది.
జరిగిన ఈ ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కరకగూడెం గ్రామానికి చెందిన ఆడెపు సతీష్ తన భార్య స్వప్న, కుమారుడు మనోహర్తో కలిసి భద్రాచలం ఆసుపత్రికి వెళ్తుండగా ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల మనోహర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు సతీష్, స్వప్న ప్రస్తుతం ఆసుపత్రిలో కోమా స్థితిలో చికిత్స పొందుతున్నారు.
ఇంటి పెద్దలు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతుండగా… కుటుంబంలో ఆధారంగా నిలవాల్సిన కుమారుడు శవపేటికలో కనిపించడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. అయితే అందరినీ మరింత కంటతడి పెట్టించిన దృశ్యం మాత్రం మనోహర్ చెల్లెలు మాధురి చేసిన చివరి కర్తవ్యం.
సాధారణంగా తల్లిదండ్రులు లేదా పెద్దలు నిర్వహించే అంత్యక్రియల్లో… చిన్న వయసులోనే మాధురి తన అన్నకు తల కొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది. కన్నీళ్లతో వణికిపోతూ, గుండె నొప్పిని దాచుకుంటూ చెల్లెలు చేసిన ఆ కర్తవ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.
“అన్నను ఇలా సాగనంపాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు” అంటూ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి వయసులోనే ఇంతటి విషాదాన్ని భరించాల్సి రావడం చూసి మహిళలు విలపించగా, యువకులు సైతం కన్నీరు ఆపుకోలేకపోయారు.
ఒక ప్రమాదం…
ఒక కుటుంబం ఆనందాన్ని క్షణాల్లో చిదిమేసింది.
అన్నకు చివరి వీడ్కోలు చెప్పిన చెల్లెలి ఆ దృశ్యం కరకగూడెం ప్రజల మనసుల్లో ఎన్నాళ్లకైనా చెరగని ముద్రగా మిగిలిపోనుంది.









