ఉద్యోగం సాధించినా.. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం – పాయం రామకృష్ణ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కష్టపడి ఎదిగిన యువకుడు నేడు మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన పాయం రామకృష్ణ తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగి ఉద్యోగం సాధించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
రామకృష్ణ 2004లో కె.ఎన్.పురం ఆశ్రమ హైస్కూల్లో పదవ తరగతి చదివి 513 మార్కులతో భద్రాచలం డివిజన్ పరిధిలో ప్రథమ ర్యాంక్ సాధించారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా పదవ తరగతి తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే RMPగా పనిచేస్తూ చదువును కొనసాగించారు.
అంతేకాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కెమిస్ట్రీ, బి.ఎడ్ పూర్తి చేసి 2020 వరకు ఆరు సంవత్సరాల పాటు గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైం టీచర్గా సేవలందించారు. కరోనా సమయంలో మళ్లీ RMPగా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించారు.
తరువాత సింగరేణి సంస్థలో ఉద్యోగం సాధించి 2022లో SCCL అండర్గ్రౌండ్ ట్రామర్గా విధులు చేపట్టారు. అనంతరం 2024లో విడుదలైన సానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టుకు సిద్ధమై ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాన్ని సాధించడం విశేషం.
తన వ్యక్తిగత విజయాలతో ఆగిపోకుండా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ.12 లక్షల పెట్టుబడితో టెంట్ హౌస్ మరియు డెకరేషన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు.
భవిష్యత్తులో “RK Mart for All Events” పేరుతో పెద్ద స్థాయి వ్యాపారాన్ని ప్రారంభించాలని తన లక్ష్యమని రామకృష్ణ తెలిపారు. తన సహకారంతో జానంపేటలో “డిజిటల్ నేస్తం” పేరుతో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న ఓ యువకుడు ప్రస్తుతం నెలకు కనీసం రూ.1 లక్ష ఆదాయం పొందుతున్నాడని చెప్పారు. అలాగే తాను వైద్య సేవలు నేర్పిన పలువురు ఇప్పటికీ RMPలుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారని వివరించారు.
ఈ సందర్భంగా యువతకు ఆయన ఇచ్చిన సందేశం ప్రత్యేకంగా నిలిచింది.
“డబ్బు ఉన్నవాడితో తిరిగితే మనకు డబ్బులు రావు.. డబ్బు ఎలా సంపాదించాలో తెలిసిన వాడితో తిరిగితే మన జీవితంలో ఎదుగుదల వస్తుంది” అని రామకృష్ణ పేర్కొన్నారు.









