దేశంలో డిజిటల్ జనగణన ప్రారంభం
న్యూఢిల్లీ,ఆధాబ్ న్యూస్:
దేశంలో మొట్టమొదటి సారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ స్వీయ నమోదు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ కుటుంబ వివరాలను నమోదు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆన్లైన్లో తన వివరాలను నమోదు చేసి దేశ ప్రజలందరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జనగణన ప్రారంభమైన తొలి రోజే సుమారు 55 వేల కుటుంబాలు స్వీయ నమోదు సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈసారి జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో ఇళ్ల వివరాలు, రెండో దశలో జనాభా వివరాలు సేకరించనున్నారు. ప్రత్యేకంగా ఈసారి కులగణనను కూడా చేపట్టనున్నారు.
ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సేవలు 16 భాషల్లో అందుబాటులో ఉంటాయి.
మొదటి దశ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుండగా, ప్రతి రాష్ట్రంలో సర్వే ప్రారంభానికి ముందు 15 రోజుల పాటు స్వీయ నమోదు సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.









