చావుబతుకుల మధ్య పసికందు… కన్నీటి కడలిలో కుటుంబం, అండగా నిలిచిన ఖాకీ మనసు!
మహబూబాబాద్,ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బూరుగు గుంపు గ్రామంలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. మల్లెల అశ్విని – మహేష్ దంపతుల మూడునెలల పసికందు ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రి పడకపై ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆ చిన్నారి నవ్వులతో కళకళలాడాల్సిన ఇల్లు, ఇప్పుడు కన్నీటి గూడుగా మారింది.
ఆసుపత్రి ఖర్చులు భారంగా మారడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కృంగిపోయారు. “మా బిడ్డను కాపాడండి” అంటూ వారి ఆవేదన ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది.
ఈ పరిస్థితిని తెలుసుకున్న కొత్తగూడ ఎస్ఐ ఇమ్మడి రాజ్ కుమార్ వెంటనే స్పందించారు. మానవత్వంతో ముందుకు వచ్చి రూ. 4,000 నగదు సహాయం అందజేశారు. ఖాకీ దుస్తుల వెనుక ఉన్న మానవత్వాన్ని ఆయన మరోసారి చాటిచెప్పారు.
ఎస్ఐ అందించిన ఈ చిన్న సహాయం ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. విధి నిర్వహణతో పాటు మానవతా విలువలను నిలబెట్టిన ఎస్ఐపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.









