ఉచిత బియ్యం అమ్మకంపై అధికారుల సీరియస్: మంచిర్యాలలో 11 రేషన్ కార్డులు రద్దు
మంచిర్యాల,ఆధాబ్ న్యూస్: ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం అక్రమంగా అమ్మకానికి పాల్పడిన లబ్ధిదారులపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా తాండూర్ మండలంలోని అచలాపూర్ గ్రామంలో 11 రేషన్ కార్డులను అధికారులు రద్దు చేశారు.
తహశీల్దార్ కార్యాలయ సమాచారం ప్రకారం, సంబంధిత లబ్ధిదారులు కేజీకి రూ.16 చొప్పున మొత్తం 1.91 క్వింటాళ్ల బియ్యాన్ని మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు గుర్తించారు. ఈ చర్యలు రేషన్ విధానాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, ఉచిత బియ్యం విక్రయించినవారిపై, కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు.









