గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
385 కేజీల గంజాయి స్వాధీనం.. రూ.2 కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, మే 22:ఆధాబ్ న్యూస్
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. మొత్తం 385 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా, దీని విలువ సుమారు రూ.2 కోట్లుగా అధికారులు తెలిపారు.
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద అశ్వారావుపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు నుంచి రాజస్థాన్కు తరలిస్తున్న 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక కారు, ఒక లారీని సీజ్ చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రుద్రంపూర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఒడిశా నుంచి బెంగళూరుకు తరలిస్తున్న కారులో 85 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలో 2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 212 గంజాయి కేసులు నమోదు కాగా, 15,398 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుల్లో 677 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.77 కోట్లుగా ఉందని తెలిపారు.
జిల్లాలో ఎవరైనా గంజాయి రవాణా, నిల్వలు లేదా విక్రయాలపై సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. గంజాయి పట్టివేతలో కీలక పాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి పోలీసులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.









