బక్రీద్ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు : ఎస్పీ రోహిత్ రాజు
మణుగూరు, మే 21 (ఆధాబ్ న్యూస్): రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు అధికారులకు ఆదేశించారు. గురువారం మణుగూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు నిర్వహించి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేయాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నాగబాబు, అశోక్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు సురేష్, పి.వి.ఎన్ రావు, నగేష్, రాజేష్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









