జానంపేటలోనే 108 అంబులెన్స్ కొనసాగించాలి
సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ డిమాండ్
పినపాక, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో పనిచేస్తున్న 108 అంబులెన్స్ వాహనాన్ని మణుగూరుకు తరలించడంపై సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DM&HO)కు వినతిపత్రం సమర్పించారు.
జానంపేట పరిధిలోని పలు గ్రామాలు, గిరిజన ప్రాంతాలు ప్రధాన పట్టణాలకు దూరంగా ఉండటంతో అత్యవసర సమయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, ప్రమాద బాధితులు, అడవి గూడెల ప్రజలకు 108 సేవలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
మణుగూరు నుండి 108 అంబులెన్స్ రావడానికి గంటల సమయం పడుతుండటంతో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రాంత ప్రజల్లో అధికంగా పేద, గిరిజన కుటుంబాలు నివసిస్తున్నందున ప్రైవేట్ వాహనాలకు వేల రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేదన్నారు.
కావున మణుగూరుకు తరలించిన 108 అంబులెన్స్ వాహనాన్ని తిరిగి జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే శాశ్వతంగా అందుబాటులో ఉంచాలని తోగటి కుమార్ డిమాండ్ చేశారు.









