ముగిసిన మహిళా సమాఖ్యల శిక్షణా కార్యక్రమం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం కరకగూడెం మండలంలోని 27 గ్రామ సమాఖ్యల పాలకవర్గ సభ్యులకు రెండు రోజులపాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సెర్ప్ రాష్ట్ర స్థాయి స్టేట్ రిసోర్స్ పర్సన్లు నిర్వహించారు.
శిక్షణలో భాగంగా గ్రామాల్లో సంఘాలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం, పొదుపులు మరియు అప్పుల చెల్లింపులు సక్రమంగా చేయడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, మహిళల సమస్యలకు సంబంధించిన “జెండర్” అంశంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. సమాఖ్య సభ్యులతో జెండర్ ప్రతిజ్ఞ కూడా చేయించారు.
ఈ కార్యక్రమాన్ని సెర్ప్ ఏపీఎం బి. వినోద్ క్రాంతి ఆధ్వర్యంలో స్టేట్ రిసోర్స్ పర్సన్లు బి. జ్యోతి, కె. దీవెన నిర్వహించారు. ఈ శిక్షణలో సీసీలు పి. విజయలక్ష్మి, సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు పోలేబోయిన సరస్వతి, అకౌంటెంట్ ప్రీతీ తదితరులు పాల్గొన్నారు.









