ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్

ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్‌ల నిర్వహణ, అనుమతులు, నిబంధనల అమలుపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే సీజ్ చేయాలని సూచించారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.

వైద్యశాఖ అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో లోపాలను గుర్తించి తగిన సూచనలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

డయాగ్నస్టిక్ సెంటర్లలో పరీక్షల ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని, ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రతి సంస్థలో రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమతులు, అర్హత కలిగిన సిబ్బంది వివరాలు అందుబాటులో ఉండాలని తెలిపారు.

అర్హతలు లేకుండా వైద్యం నిర్వహిస్తున్న ఆర్ఎంపీ వైద్యులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అర్హతలకు మించి వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ వైద్య సేవలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

PCPNDT చట్టాన్ని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేయాలని, గర్భ లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎటువంటి ఉపేక్ష ఉండదని కలెక్టర్ హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల రికార్డులు, రిజిస్టర్లు, ఫారమ్‌లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

సమావేశంలో రెన్యువల్ కోసం వచ్చిన 46 దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. అన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు, ఎన్జీవో ప్రోగ్రామ్ ఆఫీసర్ సంజీవరావు, డాక్టర్ రాందాస్, డాక్టర్ హరీష్, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగలక్ష్మి, బేబీ హెల్త్ ఎడ్యుకేటర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్