ఇంటర్, పదోతరగతి ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక సప్లమెంటరీ క్యాంపులు – 100% ఉత్తీర్ణత లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
జిల్లాలో ఇంటర్మీడియట్ మరియు పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక సప్లమెంటరీ క్యాంపులు నిర్వహించి, వారిని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ అధికారులతో కలిసి పలు అంశాలపై ఆయన సమీక్షించారు.
జిల్లాలోని అన్ని మండలాల వారీగా ఇంటర్ ఫెయిల్ విద్యార్థుల వివరాలను సేకరించి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. భద్రాచలం, పాల్వంచ, చంద్రుగొండ ప్రాంతాల్లో జరుగుతున్న సప్లమెంటరీ క్యాంపుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మే 13 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల హాజరు మరియు అభ్యాస పురోగతిపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
అలాగే పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. మండలాల వారీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, విద్యార్థుల లోపాలను గుర్తించి లక్ష్యబద్ధంగా బోధన అందించాలని తెలిపారు.
జిల్లాలోని పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన కలెక్టర్, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు 100 శాతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 12 నుంచి విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు.









