అశ్వాపురం మండలంలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై హెచ్చరిక
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్ : మండల ప్రజలకు అశ్వాపురం సీఐ జి. అశోక్ రెడ్డి కీలక సూచనలు జారీ చేశారు. మండలంలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అయితే అనవసర భయాందోళనలకు లోనై ప్రజలు తమ ఇళ్లలో, దుకాణాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్లో ఇంధనం అమ్ముతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
పెట్రోల్ బంకుల్లో వాహనాలకు మాత్రమే ఇంధనం నింపబడుతుందని, క్యాన్లు, బాటిల్స్ వంటి వాటిలో పెట్రోల్, డీజిల్ నింపడం జరగదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇంధనాన్ని అనవసరంగా నిల్వ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు.








