స్మశాన వాటికలో ఆరు నెలల పసికందును వదిలేసిన దారుణం – స్థానికులను కంటతడి పెట్టించిన ఘటన
మణుగూరు, ఏప్రిల్ 25 (ఆధాబ్ న్యూస్):
మనుషుల్లో మానవత్వం ఎక్కడికి పోతోందో అనిపించే హృదయవిదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఆరు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు స్మశాన వాటికలో వదిలేసిన సంఘటన స్థానికులను కలచివేసింది.
వివరాల్లోకి వెళితే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారం పంచాయతీ పరిధిలోని వైకుంఠ ధామం స్మశాన వాటికలో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆరు నెలల పసికందు (బేబీ గర్ల్)ను అక్కడి బాత్రూమ్లో వదిలివెళ్లారు. పసికందు ఏడుపు వినిపించడంతో గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
ఏ కారణాలతో ఈ ఘటన జరిగిందో తెలియకపోయినా, కన్న తల్లిదండ్రులే తమ బిడ్డను ఇలా వదిలివేయడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసికందు పరిస్థితి చూసి పలువురు కంటతడి పెట్టారు.
ఈ సందర్భంగా బాలల పరిరక్షణ అధికారులు స్పందిస్తూ… పిల్లలను వదిలివేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. ఎవరైనా పిల్లలను పోషించలేని పరిస్థితుల్లో ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, చట్టబద్ధంగా పిల్లలను దత్తతకు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.








