భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండుతున్న ఎండలు – 42°C దాటిన ఉష్ణోగ్రతలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జిల్లాలో పలు మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటి నమోదయ్యాయి.
కరకగూడెంలో అత్యధికంగా 42.9°C నమోదవగా, అశ్వపురం, గారిమెల్లపాడు ప్రాంతాల్లో 42.8°C, మణుగూరు ప్రాంతంలో 42.7°C ఉష్ణోగ్రత నమోదైంది. బయ్యారం, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో కూడా 42°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భద్రాచలం, సీతారామపట్నం, కొయ్యగూడెం ప్రాంతాల్లో సుమారు 41.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దుమ్ముగూడెం, అన్నపురెడ్డి పల్లి మండలాల్లో 40.6°C వరకు నమోదైంది. యెల్లందు ప్రాంతంలో 39.7°C నమోదై ‘వాచ్’ స్థాయిలో ఉంది.
ఇక జిల్లాలో ఎక్కడా వర్షపాతం నమోదు కాకపోవడం గమనార్హం. దీంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య నిపుణులు ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలని, ఎక్కువగా నీరు, ఒఆర్ఎస్ తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.








