కరకగూడెంలో ఘనంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉదయం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా “Arrive Alive” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మార్గదర్శకత్వంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ పోలెబోయిన సుజాత అధ్యక్షత వహించగా, ఉప సర్పంచ్ బుడగం రాము సహాధ్యక్షత వహించారు. కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పోలెబోయిన సుజాత మాట్లాడుతూ ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రయాణాల సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
కార్యక్రమం అనంతరం ఎస్సై పి.వి.ఎన్. రావుతో కలిసి మండల కేంద్రంలోని రహదారులపై ఉన్న గుంతలను పంచాయతీ సిబ్బందితో కలిసి పూడ్చడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి బి. రామకృష్ణ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, జీపీఓ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.








