కాలువలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధుడికి ప్రాణరక్షణ
సమయానికి స్పందించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం, ఏప్రిల్ 3 (ఆధాబ్ న్యూస్): మండలంలోని వట్టం వారి గుంపు గ్రామానికి చెందిన ఓర్సు మల్లయ్య అనే వృద్ధుడు మతిస్థిమితం కోల్పోయి కాలువలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, స్థానికులు గమనించారు. ఈ విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వెంటనే స్పందించారు.
స్థానికులతో కలిసి కాలువలో ఉన్న వృద్ధుడిని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. అనంతరం వృద్ధుడిని శుభ్రపరిచి, అవసరమైన సహాయం అందించడంతో పాటు కొత్త దుస్తులు కూడా అందజేశారు.
ఈ ఘటనపై గ్రామ ప్రజలు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మానవత్వాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలేబోయిన పాపారావు, సంపత్, వెంకటేశ్వర్లు తదితర స్థానికులు పాల్గొన్నారు.









