ప్రతి క్షణం
ప్రజల పక్షం

  క్యూరింగ్ నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్ నేత సోమయ్య ఆగ్రహం పగుళ్లు పడుతున్న సీసీ రోడ్లపై మండలంలో ఆరోపణలు

క్యూరింగ్ నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్ నేత సోమయ్య ఆగ్రహం
పగుళ్లు పడుతున్న సీసీ రోడ్లపై మండలంలో ఆరోపణలు

కరకగూడెం, ఏప్రిల్ 2 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో క్యూరింగ్ నిర్లక్ష్యం తీవ్రంగా జరుగుతోందని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బట్టుపల్లి గ్రామంలో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

క్యూరింగ్ అంటే కాంక్రీట్ రోడ్డును వేసిన తర్వాత నిరంతరం తేమ అందిస్తూ దానిని బలంగా గట్టిపడేలా చేయడమేనని సోమయ్య వివరించారు. ఎండాకాలంలో క్యూరింగ్ మరింత కీలకమని, రోజుకు కనీసం మూడు సార్లు — ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం — నీళ్లు పట్టాలని సూచించారు. లేదంటే ప్రతి మూడు మీటర్లకు మడి కట్టి, గడ్డి లేదా జ్యూట్ సంచులు వేసి వాటిని తరచుగా తడపాలని తెలిపారు.

క్యూరింగ్ సరిగా చేయకపోతే కొత్తగా వేసిన సీసీ రోడ్లు కొద్ది రోజుల్లోనే పగుళ్లు పడి బలహీనమవుతాయని హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని, ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రభుత్వం భారీ నిధులు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేయడం వల్ల ప్రజా ధనం వృథా అవుతోందని సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!