యాసంగి ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,మార్చి 31, ఆధాబ్ న్యూస్;
యాసంగి సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 1,87,309 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉన్నదని కలెక్టర్ తెలిపారు. ఇందులో సన్న రకం 1,35,365 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 51,944 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 168 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,389, బి గ్రేడ్కు రూ. 2,369 మద్దతు ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. సన్న రకం వడ్లకు అదనంగా రూ. 500 బోనస్ ఇవ్వబడుతుందని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, హమాలీలకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు టెంట్లు, షెడ్ నెట్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రద్దీ నియంత్రణ కోసం క్రాప్ బుకింగ్ ఆధారంగా టోకెన్లు జారీ చేయాలని ఆదేశించారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ ధాన్యం రాకుండా చెక్పోస్టుల ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు ఆన్లైన్లో నమోదు చేసి రైస్ మిల్లులకు తరలించాలని, రవాణాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం విక్రయాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మెరుగైన ధర లభిస్తుందని పేర్కొన్నారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత సిబ్బంది, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు ధాన్యం విక్రయానికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ వెంట తీసుకురావాలని సూచించారు. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్లు సిద్ధంగా ఉంచాలని, మద్దతు ధరలు, నాణ్యతా ప్రమాణాలు, అధికారుల వివరాలను బ్యానర్ల ద్వారా ప్రదర్శించాలని ఆదేశించారు. సన్న, దొడ్డు వడ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాథ్ బాబు, పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, వ్యవసాయ అధికారి బాబురావు, తూనికలు-కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.









