పేరంటాల చెరువు వద్ద “స్వచ్ఛ తెలంగాణ–క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం ఘనంగా నిర్వహణ
బూర్గంపహాడ్, మార్చి 28 (ఆధాబ్ న్యూస్):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని టీజీ ఎస్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మండల పరిధిలోని పేరంటాల చెరువు వద్ద టీజీ ఎస్పీఎఫ్ బీటిపిఎస్ యూనిట్ ఆధ్వర్యంలో “స్వచ్ఛ తెలంగాణ–క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చెరువు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారాన్ని తొలగిస్తూ పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, టీజీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా, ఒకచోట చేర్చి సరైన విధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువుల్లో కలవడం వల్ల నీటిని తాగే జీవులు అనారోగ్యానికి గురవుతున్నాయని, భూసారం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం, మండలం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సైలు రమేష్, చందు, సర్పంచ్ ఉషారాణి, ఉప సర్పంచ్ రమేష్, ఎస్పీఎఫ్ సిబ్బంది, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.









